అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతునారు . పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది . ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు . ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది , చనిపోయింది . ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది . అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది .
అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తునారు అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి "బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టిందని , పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసింది అని , మడి , తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని" చెప్పింది . తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది . అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. "శ్రావణమాసం చివర బాధ్ర్రపదమాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని " చెప్పింది.
ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందింది.
పూజ చేయు విధానము:
ఇంటి పూజగదిలో తూర్పు వైపున ఒకచోట గోమయంతో అలికి ముగ్గుపెట్టి, అక్కడ కంద మొక్కను (పిలకతో ఉన్నది శ్రేష్టం) ఉంచి, దానిని పసుపు, కుంకుమతో అలంకరించాలి. (కంద మొక్క దొరకని వారు కందదుంపను పసుపు, కుంకుమతో అలంకరించి పూజ చేసుకోవచ్చును.) తరువాత పసుపు కొమ్ముల తోరములు చేసుకోవలెను. (ఐదు లేదా తొమ్మిది పోగుల దారమునకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, దానికి పసుపు కొమ్ము కట్టాలి). ఈనాడు అమ్మవారికి గారెలు, బూరెలు నైవేద్యం పెడతారు. కొంతమంది, తొమ్మిది రకాలైన శాకములతో పులుసు వండి కూడా నైవేద్యం పెడతారు. గోదావరి జిల్లాలలో పనస ఆకులు బుట్టలా చేసి, అందులో ఇడ్లీ చేస్తారు. ఈ వర్షాకాలంలో వచ్చే కొన్ని రకాలైన స్వల్ప అనారోగ్యాలకు పనస ఆకులోని ఔషధ గుణాలు(దానితో ఇడ్లీ ఆవిరిపై ఉడకడం వల్ల) మంచి వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. బూరెలు పూర్ణగర్భానికి చిహ్నంగా చెప్తారు. మొదట విఘ్నేశ్వరుని పూజ చేసి, అమ్మవారికి షోడశోపచార పూజ చేసి, నైవేద్యం సమర్పించి, పోలాల అమావాస్య కథ చదువుకుని, అక్షతలు తలపై వేసుకుంటారు. కంద మొక్కకు తోరము కట్టి, తాను కూడా కట్టుకుని, పిల్లలకు కూడా మెడలో గానీ, మొలలో గానీ కట్టాలి. తరువాత ఒక ముత్తైదువను పిలిచి ఆమెకు వాయినం ఇవ్వాలి. (గారెలు, బూరెలు, లేదా బుట్టలు). ఆనాడు కొంతమంది ఉపవాసం ఉంటారు. లేదా ఒంటిపూట భోజనం చేయవచ్చు.